న్యూఢిల్లీ : ప్రియుడితో మనస్పర్థల కారణంగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఢిల్లీలోని పహారాగంజ్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఆదివారం నాడు ఓ యువతి తన ప్రియుడితో కలిసి పహారాగంజ్లోని ఓ హోటల్ రూములో దిగింది. కొద్ది సేపటి తర్వాత ఇద్దరి మధ్యా ఓ విషయంపై గొడవ చోటుచేసుకుంది. దీంతో అతడు ఆమెను అక్కడే వదిలి బయటకు వెళ్లిపోయాడు. ఆమె పలుమార్లు ఫోన్ చేసినప్పటికి అతడు పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత అతడు రూము దగ్గరకు చేరుకుని, తలుపు తట్టినా లోపలినుంచి ఎటువంటి స్పందన రాలేదు. పైగా లోపలినుంచి గడియ పెట్టిఉండటం అతడికి అనుమానం కలిగించింది. తలుపుల్ని బద్దలు కొట్టి చూడగా ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించింది. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రియుడి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.