నాన్నా.. నీ కష్టాన్ని చూడలేను ఇక వెళ్లొస్తా!

4 Dec, 2019 05:20 IST|Sakshi
వైష్ణవి (ఫైల్‌)

తండ్రికి భారం కాకూడదని యువతి ఆత్మహత్య

చీరాల అర్బన్‌: తాను తండ్రికి భారం కాకూడదని భావించిన ఓ యువతి బలవన్మరణం చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపేటలో జరిగింది. వేల్పూరి రాంబాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. రాంబాబు సౌదీలో ఉద్యోగం చేస్తూ తన ముగ్గురు పిల్లలను చదివించాడు. చివరి అమ్మాయి వైష్ణవి (22) చీరాలలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. 2 నెలల క్రితం స్వదేశానికి వచ్చిన రాంబాబుతో తాను సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటానని వైష్ణవి చెప్పింది.

ఆర్థిక ఇబ్బందులున్నా సరే కుమార్తె మాట కాదనలేక రాంబాబు హైదరాబాద్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మాట్లాడి వచ్చాడు. డబ్బులు కట్టడానికి రాంబాబు పడుతున్న ఇబ్బందులను వైష్ణవి గమనించింది. తాను తండ్రికి భారంగా మారుతున్నానని కలత చెంది, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వైష్ణవి మృతి చెందింది. 

మరిన్ని వార్తలు