పట్టించుకోవడం లేదని పరువు తీస్తున్నాడు

27 Feb, 2019 09:40 IST|Sakshi
సురేశ్‌ కుమార్‌

కాలేజీలో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌

బాధితురాలి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌ చేసి వేధింపులు

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

నిందితుడు సురేశ్‌కుమార్‌ అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: కాలేజీలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత భేదాభిప్రాయాలు రావడంతో అతడిని దూరంగా ఉంచింది. దీంతో బాధితురాలిపై పగ పెంచుకున్న ఓ యువకుడు తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ జలేందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

వనస్థలిపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివింది. ఆ సమయంలో ఆమెకు సురేశ్‌కుమార్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడటంతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో పలుమార్లు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత వీరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సురేశ్‌ను దూరంగా ఉంచుతోంది. దీంతో బాధితురాలిపై పగ పెంచుకున్న సురేశ్‌కుమార్‌ ఆమె ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ఖాతాల యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లతో తెరిచి వ్యక్తిగత ఫొటోలు పోస్ట్‌ చేశాడు. అసభ్యంగా బాధితురాలి పరువు తీసేలా నగ్న ఫొటోలు, వీడియోలు ఆప్‌లోడ్‌ చేసి కుటుంబసభ్యులకు చేర వేశాడు. దీనికితోడు పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండ టంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్‌ డాటా ఆధారంగా నిందితుడు సురేశ్‌ కుమార్‌ను చందానగర్‌లో అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు