యువతి ఆత్మహత్యాయత్నం
టెక్కలి రూరల్: ఫేస్బుక్లో యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఏడాదికి పైగా చెట్టపట్టాలు వేసుకుంటూ తిరిగారు. యువతి పెళ్లి విషయం ప్రస్తావించడంతో యువకుడు ముఖం చాటేశాడు. మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రావివలస గ్రామానికి చెందిన యువతి డిప్లామో పూర్తిచేసి విశాఖపట్నంలో డేటా ఆపరేటర్గా పనిచేస్తోంది. అక్కడ తన స్నేహితురాలి ఫేస్బుక్లో విజయనగరం జిల్లా మొదవలస గ్రామానికి చెందిన గిరిడి రాకేష్కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏడాది పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి యువకుడు ముఖం చాటేస్తూ తిరిగాడు. చివరకు నిలదీసే సరికి తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి ఎస్ఐ షేక్ఖాదర్ బాషా వివరాలు సేకరించారు.