మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

16 Apr, 2019 06:34 IST|Sakshi
నర్సింహారెడ్డి (ఫైల్‌)

కుషాయిగూడ: మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి– యాదాద్రి జిల్లాలోని ఆలేరు మండలం శాకంపల్లి గ్రామానికి చెందిన కె. నర్సింహారెడ్డి (23) బీ ఫార్మసీ పూర్తిచేసి, రాంపల్లి, ఆర్‌ఎల్‌నగర్‌లోని తన అక్క ఇంటి వద్ద ఉంటూ చర్లపల్లి ఫేజ్‌–1లోని శ్రీ మేధ పరిశ్రమలో క్యాంటిన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

నెల రోజుల క్రితం నర్సింహారెడ్డికి ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.  కాగా ఆ అమ్మాయి అప్పటికే మరో అబ్బాయితో ప్రేమలో పడింది. వారి ప్రేమ విషయాన్ని తెలియజేస్తూ ప్రేమికుడు వారి ఫొటోలను నర్సింహారెడ్డి మొబైల్‌కు పంపించాడు. దీంతో మనస్తాపం చెందిన నర్సింహారెడ్డి ఆదివారం రాత్రి  కంపెనీలోని స్టోర్‌రూంలో సిలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరుకుల కోసం తోటి సిబ్బంది స్టోర్‌రూంకు వెళ్లగా తలుపులు మూసిఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే నర్సింహారెడ్డి మృతిచెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు