మద్యం మత్తులో మృత్యువుతో ఆట.. విషాదం!

22 Apr, 2019 19:55 IST|Sakshi

చంద్రగిరి : మద్యం మత్తులో ఓ యువకుడు స్నేహితులను ఆటపటించాలనుకున్నాడు. తాను చనిపోతున్నానంటూ ఫ్రెండ్స్‌కు వీడియో కాల్‌ చేశాడు. వారి ముందు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించాలనుకున్నాడు. అందులో భాగంగా చీరను తీసుకుని ఫ్యానుకు కట్టి మెడకు ఉరి బిగించుకున్నాడు. ఇంతలోనే మెడకు ఉరి బిగిసింది. ఉరి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. ఫలితం లేకపోయింది. సరదా కోసం అనుకుంటూ.. ప్రమాదకరమైన మృత్యువు కోరల్లో చిక్కి.. స్నేహితులు చూస్తుండగానే ప్రాణాలు విడిచాడు.

చిత్తూరు జిల్లా, తిరుచానూరు సమీపంలోని దామినీడులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దామినీడుకు చెందిన శివకుమార్ అనే యువకుడు మద్యంలో మత్తులో స్నేహితులకు వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నానంటూ వారిని ఆటపట్టించాలనుకున్నాడు. కానీ మద్యం మత్తులో ఉన్న అతను నిజంగానే ఉరి బిగించుకొని ప్రాణాలు విడిచాడు. తమ కళ్లముందే శివకుమార్ ఆత్మహత్య చేసుకుంటాడని అతని స్నేహితులు ఊహించలేకపోయారు. ఏదో హడావుడి చేస్తున్నాడులే అనుకున్నారు. వీడియోకాల్ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. తొలుత ఊరి వేసుకుంటున్నట్టు శివకుమార్ తన మెడకు చీరతో ముడివేశాడు. కాలు కింద పెట్టాడు. ఈ క్రమంలో ఉరి బిగుసుకున్న తర్వాత.. శివకుమార్ ఆ ఉరి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికే చీర మెడకు బిగుసుకుపోయింది. క్షణాల్లోనే ప్రాణం పోయింది. ఈ ఘటన శివకుమార్ కుటుంబంలో విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు