జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..

28 Jan, 2019 08:33 IST|Sakshi

మద్యం​ మత్తులో మితిమీరిన వేగంతో

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జుబ్లీహిల్స్‌లో మందుబాబులు కారుతో బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంతో దూసుకుపోతూ.. మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. అదృష్టం బాగుండి సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ముగ్గురు వ్యక్తులకు ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు-36 నుంచి కొండాపూర్‌కు వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉండటం, అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల కారు స్టీరింగ్ అదుపుచేయలేక.. రోడ్డు మీద బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంగా అజాగ్రత్తగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా కారు డ్రైవింగ్ సీటు వైపున్న టైరు ఊడిపోయింది. కారులో ఉన్న కొండాపూర్‌కు చెందిన జయంత్, పవన్‌తోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అదృష్టం బాగుండి సమయానికి ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ముగ్గురికీ ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ ముగ్గురిని మాదాపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు