బంజారాహిల్స్‌లో కలకలం

15 Aug, 2018 14:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో కలకలం రేగింది. ఓ యువకుడు పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనతో  అప్రమత్తమైన పోలీసులు మంటలార్పి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ వివరాలు.. ముషిరాబాద్‌ చెందిన సతీష్‌ (28) అనే యువకుడికి బంజారాహిల్స్‌ దేవరకొండ బస్తీకి చెందిన ఓ యువతితో వివాహమైంది. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ యువతి తన పుట్టింటికి వెళ్లింది. మంగళవారం సతీష్‌ ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు.

దీంతో ఆమె తండ్రి మనోజ్‌, సతీష్‌పై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సతీష్‌.. తన మామ మనోజ్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అతను ఎంతకీ స్పందిచకపోవడంతో బుధవారం పెట్రోల్‌ డబ్బాతో స్టేషన్‌కు వచ్చిన సతీష్‌.. ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు ఇసుక సాయంతో మంటలార్పి ప్రాణాలు రక్షించారు. ప్రస్తుతానికి ప్రాణపాయం తప్పిందని, తీవ్రంగా గాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు