బండ్ల గణేశ్‌కు ఆంధ్రా రాజకీయాలు ఎందుకు?

15 Dec, 2017 13:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ : టాలీవుడ్ కమెడియన్‌, నిర్మాత బండ్ల గణేష్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజాపై ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బండ్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బండ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విజయవాడ పోలీస్‌ కమీషనరేట్‌లో వారు ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేత బండి పుణ్యశీల నేతృత్వంలోని బృందం కమీషనర్‌ను కలిసి ఫిర్యాదును అందించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. బండ్ల గణేష్‌ కు ఆంధ్రా రాజకీయాలతో అసలు అవసరం ఏంటని? వారు ప్రశ్నించారు. మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని.. దమ్ముంటే విజయవాడ వచ్చి మాట్లాడాలని ఆమె సవాల్‌ విసిరారు. ఓ మహిళా నేతపై అసభ్యపదజాలం వ్యాఖ్యలు చేయటం దారుణమని.. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని పోలీస్‌ శాఖను ఆమె కోరారు. మహిళా శాసనసభ్యురాలిపై అనుచిత వ్యాఖ్యల అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆమె డీజీపీకి విజ్ఞప్తి చేశారు. 

నటి మీరా చోప్రా, నటుడు సచిన్‌ జోషి గతంలో బండ్ల వ్యక్తిత్వం ఎలాంటి చెప్పటం చూశామని పుణ్యశీల గుర్తు చేశారు. తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఎమ్మెల్యే రోజాకు క్షమాపణలు చెప్పాలని మహిళా నేతలు బండ్లను డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు