రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరాం: బుగ్గన

13 Mar, 2020 20:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు రాలేదని.. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌ రూ.60 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిందనే విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం త్వరితగతిన జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3వేల కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు.

స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగానే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒకట్రెండు చోట్ల గొడవలు జరిగి ఉండొచ్చన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ తగ్గింది అనేది తప్పుడు ఆరోపణ అని, గత ప్రభుత్వం అనవసర ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. విద్య, వ్యవసాయ రంగాలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్లు, ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు