‘జీతాలు చెల్లించాలి.. రూ. 5 వేల కోట్లివ్వండి’

31 May, 2020 16:29 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం సాయం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ట్విటర్‌లో వెల్లడించారు. ‘ఈ క్లిష్ట సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’అని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి మనీశ్‌ సిసోడియా ఈ విషయమై మాట్లాడుతూ.. కరోనా విపత్తు సమయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామన్న నిధుల్ని ఇవ్వలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలకు రూ.3500 కోట్లు, ఇతర అవసరాలకు కలిపి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామని తెలిపారు.

గత రెండు నెలలుగా ఢిల్లీలో రూ.500 కోట్ల చొప్పునే జీఎస్టీ వసూళ్లు జరిగాయని వెల్లడించారు. ఇక కరోనా పోరులో నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల జీతాల చెల్లింపునకు కూడా సొమ్ము లేదని   వాపోయారు. ఇదిలాఉండగా.. దేశ రాజధానిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నటికీ.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ ఎత్తివేసేందుకు సిద్ధమని కేజ్రీవాల్‌ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో సడలిపులు ఇచ్చారు. ఢిల్లీ వ్యాప్తంగా 120 కంటైన్‌ జోన్లు ఉండటం గమనార్హం. ఇక ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 వేల కరోనా పాటిజివ్‌ కేసులు నమోదవగా.. 416 మంది మరణించారు.
(చదవండి: ఢిల్లీలో మహమ్మారి విజృంభణ)

మరిన్ని వార్తలు