ఆరు నెలల్లో ఉరి...రేపటినుంచే దీక్ష

2 Dec, 2019 18:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) చైర్‌ పర్సన్‌ స్వాతి మాలివాల్‌ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి  పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గత కొద్ది రోజులుగా నమోదైన అత్యాచార సంఘటనలతోపాటు, హైదరాబాద్‌లో చోటు చేసుకున్న దిశ హత్యాచార ఘటనతో  తల్లిడిల్లిన ఆమె మరోసారి  నిరహారదీక్షకు దిగనున్నారు.  రేపిస్టులకు 6 నెలల లోపు మరణ శిక్ష విధించాలనేది స్వాతి మలేవాల్‌ డిమాండ్‌  చేస్తూ రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలనుంచి జంతర్‌ మంతర్‌ వద్ద నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు.  మహిళలపై అత్యాచారాలకు తెగబడిన నేరస్థులకు మరణశిక్ష విధించాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు.  కేంద్రం నుంచి కచ్చితమైన హామీ లభించేంతవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం ఆమె చేశారు.

కాగా మైనర్లపై అత్యాచార కేసుల్లో నేరస్తులకు  మరణ శిక్ష వేయాలని స్వాతి గతంలో చాలా సార్లు డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై గత ఏడాది ఏప్రిల్‌లో నిరాహార దీక్షను చేపట్టారు. అయితే 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచార ఘటనల్లో నిందితులకు  మరణశిక్ష సహా, కఠిన శిక్షలు అమలు చేసేలా కేంద్రం  ఒక ఆర్డినెన్స్‌ను పాస్‌ చేయడంతో 10 రోజుల తరువాత ఆమె తన దీక్షను విరమించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు