యూఎస్లో తెలుగు విద్యార్థి దుర్మరణం

15 Aug, 2015 14:48 IST|Sakshi

నల్లగొండ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి (27) దుర్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ రెడ్డి మరణించాడని ఆతడి కుటుంబ సభ్యులు శనివారం వెల్లడించారు. తమ కుమారుడు అభిషేక్‌రెడ్డి (27) అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎమ్మెస్సీ చేస్తున్నాడని అతడి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, పద్మజా శనివారం తెలిపారు. అభిషేక్ తన సోదరి ప్రియాంకతో కలసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడని చెప్పారు.

మరో 10 రోజుల్లో  అతడి చదువు పూర్తి కానుందని... సెప్టెంబర్లో ఉద్యోగంలో చేరవలసి ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని వారు కన్నీరుమున్నీరయ్యారు. నర్సింహరెడ్డి, పద్మజా దంపతుల  స్వగ్రామం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామం. అయితే వారు వ్యాపార రీత్యా హైదరాబాద్లోని సాగర్రోడ్డులోని గాయత్రి చౌరస్తా సమీపంలో వారు నివసిస్తున్నారు.

మరిన్ని వార్తలు