వాషింగ్టన్లో ఘనంగా ఉమెన్స్ డే సంబరాలు

27 Mar, 2017 14:05 IST|Sakshi

వాషింగ్టన్ డీసీ :
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమానికి 1200 మందికి పైగా ఆటా మహిళా అభిమానులు హాజరయ్యారు. మహిళల ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల అన్నమాచార్య గీతాలు అతిథులను ఆకట్టుకున్నాయి. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు పాటలు, నృత్యాలతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ మహిళ బార్బరా కంస్టాక్, లౌడౌన్ కౌంటీ బోర్డు అఫ్ సూపర్వైసర్ ఫిలీస్ రాన్డల్ హాజరై మహిళాసాధికారతపై ప్రసంగించారు. మహిళలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.

మహిళల సాధికారత త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్బరా మాట్లాడుతూ ప్రస్తుతమున్న వర్జీనియా అసెంబ్లీలో తాను ఒక్కదాన్నే మహిళనని, మహిళల ప్రాధాన్యం అమెరికా చట్టసభలలో పెరగాలని పిలుపునిచ్చారు. ఫిలీస్ మాట్లాడుతూ లౌడాన్ కౌంటీ బోర్డులో తాను మొట్ట మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళనని అన్నారు. భారతీయ మహిళలు కూడా అమెరికా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని రెప్రెసెంతతివెస్ కోరారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రెండు నెలల నుంచి దాదాపుగా ౩౦ మంది మహిళా వాలంటీర్స్ అహర్నిశలు కృషి చేశారు. సెక్రటరీ సౌమ్య కొండపల్లి, చైర్ కవిత చల్ల, సుధా కొండాపు ఆధ్వర్యంలో మహిళా టీం రోషిని, శిరీష, విజయ, స్వాతి, అను, భార్గవి, హారతి, వినయ, శ్రీలేఖ, ప్రియా, గీత, పునీత, ప్రశాంతిలతోపాటూ మరికొందరు మహిళా వాలంటీర్స్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఆటా ట్రస్టీలు జయంత్ చల్ల, భువనేశ్ బుజాల, సౌమ్య కొండపల్లి, రీజినల్ కోఆర్డినేటర్స్ అమరేందర్ బొజ్జ, సుధీర్ బండారు, రామ్మోహన్ సూరినేని,  ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్స్ విజయేందర్ రెడ్డి అన్నం, కౌశిక్ సామ, పల్లా రవిందర్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులకు ఆటా రుచికరమైన భోజనాన్ని అందించింది. ఆటా టీం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో జరిగే ప్రతి ఆటా కార్యక్రమానికి అందరి సహకారం కావాలని కోరింది. ఈ కార్యక్రమం మొత్తం మహిళలతో నిర్వహించడం ప్రత్యేకం.









మరిన్ని వార్తలు