టాక్ ఆద్వర్యం లో యూకేలో ఉగాది వేడుకలు

4 Apr, 2017 22:34 IST|Sakshi
యూకే లోని షెఫీల్డ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూకే (టాక్ ), హిందూ మందిర్ సంయుక్తంగా  శ్రీ హేవిళంబి నామ ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. టాక్ సభ్యులు సాయిబాబు నర్రా, అరవింద్ రెడ్డి అధ్యక్షతన  షెఫీల్డ్  హిందూ దేవాలయంలోని  కమ్యూనిటీ హాల్లో  జరిగిన ఈ వేడుకలకు లార్డ్ లెఫ్టినెంట్  అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ  కూమ్బ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాస తెలుగు వారు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మొదట సాంప్రదాయ పూజలతో ఆరంభమైన వేడుకలో పంచాగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 
ముఖ్య అతిథి లార్డ్ లెఫ్టినెంట్  అఫ్ సౌత్ యార్క్ షైర్ ఆండ్రూ  కూమ్బ్ మాట్లాడుతూ.. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనకు హిందూ ధర్మం, సాంప్రదాయాలంటే ఎంతో గౌరవమని, ఇకముందు కూడా హిందూ ధర్మం గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నారు. టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. రుచులలో తీపి, చేదు ఉన్నట్లే జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది సంబరాలలో తెలుగువారే కాకుండా మరాఠీలు , గుజరాతీలు, బెంగాలీలు మరియు పంజాబీలు పాల్గొనడం విశేషం. తెలుగు వారి పండగలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న షెఫిల్డ్ హిందూ సమాజ్ సంస్థకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సంబరాలలో టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, సభ్యులు సాయిబాబు నర్రా, అరవింద్ రెడ్డి, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, శ్రీకాంత్ జెల్లా, స్నేహలత, ప్రత్యుష, మాధవ్,విజయ్ ,భూషణ్ ,రాజేష్ వాకా ,వెంకీ ,రాజు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు