సిలికానాంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు

5 Apr, 2017 11:15 IST|Sakshi
సిలికానాంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు

కాలిఫోర్నియా :
శ్రీ హేమలంబ నామ ఉగాది ఉత్సవాలు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో సిలికానాంధ్ర యూనివర్సిటీలోని లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పంచ ఘట నాదలయవిన్యాసం, వాద్య సంగీత గోష్టి (ఫ్యుజన్) కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి.
 
ప్రపంచ ప్రఖ్యాత ఘటవాయిద్య  విద్వాంసులు పద్మభూషణ్ విక్కు వినాయకరాం తన శిష్య బృందంతో నిర్వహించిన 'పంచ ఘట నాదలయ విన్యాసం' తో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ  ప్రాంగణం  పరవశించింది. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో విక్కు వినాయకరాం మాట్లాడుతూ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పవిత్రతో కూడిన దివ్యత్వం ఉన్నట్టుగా అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఏ ఆశయం కోసం ప్రారంభించారో అది తప్పక నెరవేరుతుందన్నారు. తానూ ఇందులో భాగమై, విద్యార్ధులకు విద్య నేర్పడానికి సిద్ధం అని ప్రకటించారు. తాను కచేరీ చేసే ఘటం ని సంతకం చేసి కానుకగా సిలికానాంధ్ర యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం రాబోయే ఫాల్ సెమిస్టర్ కరపత్రాలు, గోడపత్రికను పద్మభూషణ్ విక్కు వినాయకరాం ఆవిష్కరించి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, యూనివర్సిటీ కార్యవర్గానికి అందజేశారు.


బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి హేమలంబ ఉగాది పంచాంగ పఠనం చేశారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనాన్ని మధు ప్రఖ్య సంధాతగా ఎంతో ఆసక్తిగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా పిల్లలకు నిర్వహించిన ‘భాషా వికాస పోటీ’ విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నవరపు రామస్వామి శిష్యులు 'దేవన్ డ్రోన్ ' గా చిరపరిచితులైన కళాకారులు వయోలిన్ వాసుదేవన్, ఫ్లూట్ ఫణిలు నిర్వహించిన వాయులీన-వేణుగాన ‘నాదామృత వర్షిణి’ కార్యక్రమం  ప్రేక్షకులను ఆసాంతం ఉర్రూతలూగించింది. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ.. యువతే రేపటి భవిత అనే సిద్ధాంతాన్ని సిలికానాంధ్ర ఎప్పుడూ నమ్ముతుందని, అందుకే ప్రతిభావంతులైన యువ కళాకారులను ఎల్లప్పుడూ సిలినాంధ్ర వేదిక స్వాగతం పలుకుతుందని అన్నారు.


 ఇదే వేదికపై, ఎంజే తాటిపాముల, ఫణిమాధవ్ కస్తూరి సిద్ధం చేసిన సిలికానాంధ్ర అంతర్జాల పత్రిక 'సుజనరంజని' కొత్త పోర్టల్ విడుదల చేశారు. రత్నమాల వంక, మాధవ కిడాంబి, పద్మ హరి, సిద్దార్ధ్ నూకల, సాయి కందుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు