అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశనగ పంపిణీలో భాగంగా శనివారం 28వ రోజు 1,458 మంది రైతులకు 1,651 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2,75,123 మంది రైతులకు 3,17,092 క్వింటాళ్లు అందజేశామన్నారు. 18,226 మంది రైతులకు 2,079 క్వింటాళ్లు విత్తన కందులు, 38,079 మంది రైతులకు 67,388 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశామన్నారు. ఎంవీకేల ద్వారా 45,065 క్వింటాళ్లు వేరుశనగ, 43,021 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశామన్నారు.
ఆదివారంతో పాటు రంజాన్ పండుగ కారణంగా సోమవారం విత్తన పంపిణీ ఉండదన్నారు. ఇక పెట్టుబడిరాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)కి సంబంధించి జాబితాలు అప్లోడ్ చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. అయితే సర్వర్ సమస్య కొంత వరకు ఇబ్బంది పెడుతోందన్నారు. నెలాఖరుకు తొలిజాబితా ద్వారా ట్రెజరీ నుంచి బ్యాంకులు అటు నుంచి రైతుల ఖాతాల్లోకి పరిహారం జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.