180 బస్తాల బియ్యం పట్టివేత

28 Dec, 2016 00:23 IST|Sakshi

సోమందేపల్లి : స్టోర్‌ బియ్యం అక్రమంగా కర్ణాటకాకు తరలిస్తూ పట్టుబడిన సంఘటన మంగళవారం రాత్రి 10 గంటలకు మండలంలో చోటుచేసుకుంది. ధర్మవరం నుంచి ఐచర్‌ వాహనంలో స్టోర్‌ బియ్యం కర్ణాటకలోని కోలార్‌ ప్రాంతానికి తరలిస్తున్నట్లు విజిలెన్స్‌ అడిషనల్‌ ఎస్పీ అనిల్‌ బాబుకు సమాచారం వచ్చింది. దీంతో ఆ శాఖ సీఐ గంగనాథ్‌ బాబు, ఎస్‌ఐ రామకృష్ణ సోమందేపల్లి వై జంక్షన్‌ వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా 180 బస్తాల బియ్యం పట్టుబడ్డాయి. చెక్‌పోస్టులు, ఇతర తనిఖీ కేంద్రాల వద్ద ఎటువంటి అనుమానాలు రాకుండా బియ్యం బస్తాలపై వరిగడ్డి ఏర్పాటు చేసుకుని టార్పల్‌ కప్పుకుని జాతీయ రహదారిపై పోలీసుల కళ్లు గప్పి తీసుకెళుతున్నట్లు అధికారులు తెలిపారు. నిత్యం అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాల నుంచి స్టోర్‌ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వాహనాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు లేకపోవడంతో గుడిపల్లి వీఆర్‌వో రవిచంద్రరెడ్డికి పట్టుబడ్డ బియ్యాన్ని అందించారు.

మరిన్ని వార్తలు