సాగుకు 19 గంటలు!

27 Jul, 2016 00:03 IST|Sakshi
సాగుకు 19 గంటలు!
  • ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఎన్పీడీసీఎల్‌
  • పగటి పూట భారం తగ్గించేందుకే అంటున్న అధికారులు
  • స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో గందరగోళం
  • డివిజన్‌కో తీరుగా కరెంట్‌ సరఫరా
  • హన్మకొండ : వ్యవసాయానికి 19 గంటల విద్యుత్‌ సరఫరా అవుతోంది. ఇది ప్రయోగాత్మకంగానే అని ఉత్తర మండల విద్యుత్‌ సరఫరా సంస్థ (ఎన్పీడీసీఎల్‌) యాజమాన్యం చెబుతోంది. ఇలా సరఫరాపై అధికారిక ఆదేశాల్లో స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఒక్కో డివిజన్‌లో ఒక్కో తీరుగా కరెంటు సరఫరా జరుగుతోంది. కొన్ని డివిజన్లలోనే సాగుకు 19 గంటల కరెంట్‌ సరఫరా అవుతోంది. ‘పగటి పూట విద్యుత్‌ సరఫరాపై భారం తగ్గించేందుకు 19 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఇలా చేయడం ద్వారా నిర్దేశించిన సమయంలో కాకుండా రైతులు వేర్వేరు సమయాల్లో కరెంటును వినియోగించుకుంటారు. ఒకేసారి పడే భారం తగ్గుతుంది. సరఫరాలో సమస్యలు తలెత్తవు’ అని ఎన్పీడీసీఎల్‌  ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రయోగాత్మక అమలు విధానం క్షేత్రస్థాయిలో అధికారుల ఇష్టారీతిగా మారుతోంది. కొన్ని డివిజన్లలో 19 గంటలు, మరికొన్ని డివిజన్లలో 9 గంటలు ఇలా అయోమయంగా జరుగుతోంది. రైతాంగానికి ఖరీఫ్‌ నుంచి పగటిపూట 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తోంది. ఒక్కో సబ్‌స్టేçÙన్‌ను రెండు ఫీడర్లుగా విభజించి రెండు వేర్వేరు సమయాల్లో సబ్‌స్టేçÙన్‌ పరిధిలో రెండు విడతలుగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఒక ఫీడర్‌కు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో ఫీడర్‌కు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సమయాల్లోనే విద్యుత్‌ సరఫరా జరుగుతుండడంతో విద్యుత్‌ సరఫరా, సబ్‌స్టేçÙన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లపై భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు అవసరమున్న రైతులు రాత్రి వేళలో విద్యుత్‌ మోటారు నడిపించుకునేందుకు వీలుగా గత రెండు రోజులుగా ఎన్పీడీసీఎల్‌ రోజుకు 19 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 23న ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం డివిజనల్‌ ఇంజనీర్లకు సమాచారం చేరవేసింది. జిల్లాలో ఎన్పీడీసీఎల్‌ పరంగా వరంగల్‌ టౌన్, వరంగల్‌ రూరల్, జనగామ, నర్సంపేట, ములుగు, మహబూబాబాద్‌ డివిజన్‌లు ఉన్నాయి. ఇందులో జనగామ డివిజన్‌లో ఇప్పటి వరకు 19 గంటలు విద్యుత్‌ సరఫరా చేయడం లేదు. ఈ డివిజన్‌లో బుధవారం నుంచి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ములుగు డివిజన్‌లో రైతులు కోరిన ప్రాంతాలకు మాత్రమే 19 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ఆ డివిజన్‌ డీఈఈ తెలిపారు. మిగతా డివిజన్‌లలో 19 గంటలపాటు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. అధికారులు ఇష్టానుసారంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌తో రైతులు ఆగమాగం అవుతున్నారు. 19 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం కచ్చితంగా ప్రకటించకపోవడంతో రైతుల్లో నమ్మకం కలగడం లేదు. దీంతో రైతులు పగటిపూట 9 గంటల విద్యుత్‌ సరఫరానే నమ్ముకుంటున్నారు. మిగతా సమయంలో విద్యుత్‌ సరఫరా చేస్తున్నా...అదనంగా విద్యుత్‌ అవసరమున్న రైతులు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. 19 గంటల విద్యుత్‌ సరఫరాపై రైతుల్లో నమ్మకం కలిగించినప్పుడే ఎన్పీడీసీఎల్‌ ఆశించిన ఫలితాలు వస్తాయని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. 
మరిన్ని వార్తలు