225 బస్తాల బియ్యం పట్టివేత

21 Aug, 2016 00:35 IST|Sakshi

రాయదుర్గం అర్బన్‌: కణేకల్లులోని ఒక గోదాము నుంచి కర్ణాటకలోని తళుకు వద్దనున్న రైస్‌మిల్లుకు లారీ( కేఏ09 ఏ 9515)లో అక్రమంగా తరలిస్తున్న 225 బస్తాల బియ్యాన్ని శనివారం ఉదయం రాయదుర్గం చెక్‌పోస్టు సమీపంలో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ రమేష్, మరో వ్యక్తి మంజు పరారు కాగా.. ప్రహ్లాద ప్రదీప్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తహసీల్దార్‌ అఫ్జల్‌ఖాన్‌ తెలిపారు.

225 బస్తాల బియ్యంతోపాటు కొన్ని గోధుమ ప్యాకెట్లు కూడా లభించినట్లు తెలిపారు. లారీని తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించామన్నారు. బియ్యం బస్తాలను స్టాక్‌పాయింట్‌లో తూకం వేయించి సీఎస్‌డీటీ రామకృష్ణకు అప్పగించామన్నారు. ఈ బియ్యం చౌక బియ్యమా కాదా అని నిర్ధారణ చేసేందు జాయింట్‌ కలెక్టర్‌కు శ్యాంపిల్‌ పంపుతున్నట్లు వెల్లడించారు. ఎటువంటి వే బిల్లులు లేకుండా తరలిస్తున్నందున 6–ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

తనిఖీ చేయకుండానే రుసుం వసూలు
రాయదుర్గం – మొలకాల్మూర్‌ రోడ్డులో ఉన్న వ్యవసాయ మార్కెట్‌యార్డు చెక్‌పోస్టులో సూపర్‌వైజర్‌ కిశోర్‌కుమార్‌ ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా లారీ డ్రైవర్‌ మొక్కజొన్న అని చెప్పగానే పది టన్నుల బరువు లెక్కగట్టి రూ.1.50 లక్షలు అంచనా వేసి రూ. 1500 మార్కెట్‌రుసుం వసూలు చేశారు. చెక్‌పోస్టులో తనిఖీ చేసి ఉంటే అక్కడే దొరికిపోయేది.  

అధికార పార్టీ అండదండలతోనే..
అధికార పార్టీ అండదండలతోనే బియ్యాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కర్నాటకకు తరలించకుండా చెక్‌పోస్టులో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు బి.బాబు డిమాండ్‌ చేశారు. బియ్యం తరలించే ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి ఎన్‌ నాగరాజు కోరారు.

మరిన్ని వార్తలు