రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

18 Feb, 2016 00:21 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన.. మృతులు కడప జిల్లావాసులు

 మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు  దుర్మర ణం చెందారు.  మృతులు ఏపీలోని కడప జిల్లావాసులు. కడప జిల్లా  చిన్నమండెం మండల కేంద్రానికి చెందిన హరి కిరణ్, స్వప్న, బంధువులు చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన శ్రీధర్, జ్యోతి దంపతులు, వీరి కుమారుడు సాయితో కలసి కడప జిల్లా మదనపల్లెలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రి తిరిగి హరి కిరణ్‌కు చెందిన కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

మార్గమధ్యంలోని భూత్పూర్ సమీపంలోని ఫ్లైఓవర్ దిగిన వెంటనే ముని రంగస్వామి దేవాలయం ఎదుట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పింది. పక్క నుంచి వెళ్తున్న లారీ కిందకు కారు వెళ్తుం దేమోనని భావించి హరికిరణ్ స్టీరింగ్‌ను డివైడర్ వైపు తిప్పాడు. దీంతో కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలి వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్(30) జ్యోతి(27), సాయి(8) అక్కడికక్కడే మృతి చెందా రు. తీవ్రంగా గాయపడిన హరి కిరణ్(27), స్వప్నలను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా హరికిరణ్ మృతి చెందాడు. నిద్రమత్తులో హరికిరణ్ డ్రైవింగ్ చేస్తుండడంతో మార్గమధ్యంలో పలుసార్లు కారు అదుపు తప్పబోయింది. ఈ క్రమంలో భార్య స్వప్న అతడిని హెచ్చరించి అప్రమత్తం చేసింది. హరికిరణ్ హైదరాబాద్ బోడుప్పల్‌లో భార్యతో కలసి నివాసముంటున్నాడు. అతడు మెగాటెక్నాలజీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. శ్రీధర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పీఈటీ. హరికిరణ్, స్వప్నలకు రెండేళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి పిల్లలు లేరు.

మరిన్ని వార్తలు