పోలీస్‌ రాత పరీక్షకు 551 మంది ఎంపిక

16 Nov, 2016 00:52 IST|Sakshi

 కర్నూలు: కమ్యూనికేషన్‌ కానిస్టేబుళ్ల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్టు కొనసాగుతోంది. స్థానిక ఏపీఎస్పీ మైదానంలో 8వ రోజు మంగళవారం అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించారు. 800 మందిని ఆహ్వానించగా 713 మంది హాజరయ్యారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు స్క్రీనింగ్‌ టెస్టులో పాల్గొన్నారు. కడప ఎస్పీ రామకృష్ణ పర్యవేక్షణలో స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించారు. ముందుగా హాల్‌టిక్కెట్, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం బరువు, ఎత్తు, ఛాతి కొలతలలో అర్హత సాధించినవారికి 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి పరుగు పందెం నిర్వహించగా 551 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. 168 మంది అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో క్రీడామైదానంలోకి అనుమతించకుండా వెనక్కి పంపారు. తహసీల్దార్లు జారీ చేసిన క్రీమీలేయర్, ఓబీసీ సర్టిఫికెట్లు, ఇతర అర్హత కల్గిన ఒరిజినల్స్‌తో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలతో అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఎస్పీ రామకృష్ణ సూచించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు ఎ.జి.కృష్ణమూర్తి, బాబుప్రసాద్, వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నుంచి వచ్చిన లైజనింగ్‌ డీఎస్పీ కె.షరీఫ్, ఈ–కాప్స్, మినిస్టీరియల్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు