రూ. 351 కోట్లతో 60 విద్యుత్ సబ్‌స్టేషన్లు

15 Aug, 2016 20:35 IST|Sakshi

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఎస్పీడీసీయల్ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో రూ. 351కోట్లతో 60 సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై దొర తెలిపారు. తిరుపతిలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీయస్, డీడీయూజీజేవై పథకాల కింద 36 ఇన్‌డోర్, 24 ఔట్‌డోర్ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపును మరింత సరళతరం చేసామని, కొత్త యాప్ ద్వారా ఎక్కడ నుంచైనా బిల్లులను చెల్లించవచ్చన్నారు. రైతులకు సౌకర్యవంతంగా సేవలు అందించేందుకు రూ. 12.26 కోట్లతో 13వేల రిమోట్ కంట్రోల్ ప్యానెల్స్‌ను కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఐపీయస్, ఐఆర్‌యస్‌కు ఎంపికైన విద్యుత్ ఉద్యోగుల పిల్లలను ఆయన సత్కరించారు.

 

>
మరిన్ని వార్తలు