అనంతపురం అర్బన్ : ‘అనంత’ను పొగరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగంలో దీపం మేళా ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 66,039 గ్యాస్ కనెక్షన్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేసినట్లు జాయింట్ కలెక్టర్ రమామణి తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం డీఎస్ఓ శివరాంప్రసాద్తో కలిసి గ్యాస్ కనెక్షన్ల మంజూరు వివరాలను విలేకరులకు తెలిపారు. జిల్లాలో 2.42 లక్షల మంది తెల్లకార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు లేనట్లు గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించగా 1,24,240 మంది తమకు అవసరం లేదని చెప్పారన్నారు.
అలా చెప్పిన వారిలో కొందరు స్థానికంగా లేరని, కొందరు ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారని, మరికొందరు పూరిగుడిసెల్లోనూ, ఇంకొందరు ఉమ్మడి కుటుంబాల్లోనూ ఉన్నారన్నారు. దీంతో వాటిని తిరస్కరించి మిగిలిన 1,17,760 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను అందజేయాల్సి ఉండటంతో, జిల్లావ్యాప్తంగా దీపం మేళాలు నిర్వహించి ఇప్పటివరకు 66,039 కనెక్షన్లు అందజేశామన్నారు. మిగిలిన 51,721 మందికి జూన్ రెండో తేదీ నాటికి అందజేస్తామన్నారు.