ములుగు : హన్మకొండ నుంచి ములుగుకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు రోడ్డు పక్కన మిషన్ భగీరథ పనులు చేస్తున్న జేసీబీ హైడ్రాలిక్ బకెట్ ప్రమాదవశాత్తు తగలడంతో బస్సులోని ప్రయాణì కులకు గాయాలైన సంఘటన మండలంలోని పందికుంట సమీపంలో మంగళవారం జరిగింది. ఆర్టీసీ బస్సు(ఏపీ 28జెడ్ 2308) హన్మకొండ నుంచి ప్రయాణికులతో ములుగు వైపు బయల్దేరింది. పందికుంట సమీపంలో మిషన్ భగీరథ పైపుల కోసం కందకాలు తవ్వుతున్న జేసీబీ డ్రైవర్ గమనించకుండా ఒక్కసారిగా వెనక్కి తిప్పడంతో బకెట్ బస్సుకు తాకింది. దీంతో మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన బొచ్చు ఈశ్వరమ్మ, ఎం. పద్మ, బండారుపల్లికి చెందిన ముఖ్తార్పాషా, ముత్యాల ఉప్పరయ్య, జాకారానికి చెందిన తోట మల్లయ్య, కండక్టర్ తిప్పాని అనిత, ములుగుకు చెందిన అఫ్పియా, షకీల్కు గాయాలు కాగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై మల్లేశ్యాదవ్ పరిశీలించారు.