సీఐడీ సీఐపై నిర్భయ కేసు

4 Apr, 2016 11:24 IST|Sakshi
సీఐడీ సీఐపై నిర్భయ కేసు

కరీంనగర్: విచారణ పేరుతో ఓ మహిళా ఉద్యోగిని వేధించిన సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దయాకర్ రెడ్డి తరచూ ఫోన్లు చేయడంతో పాటు అభ్యంతరకర మెసేజ్లు పంపి అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఈ మహిళ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. అక్రమ ఫైనాన్స్ కేసులో అరెస్ట్ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తులో భాగంగా అతడి బంధువులను సీఐడీ అధికారులు కరీంనగర్ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి విచారణ చేశారు. బాధిత మహిళ కూడా మోహన్‌రెడ్డి బంధువు కావడంతో ఆమెను కూడా విచారణకు పిలిపించారు.

విచారణ బృందంలో సభ్యుడిగా ఉన్న సీఐడీ సీఐ దయాకర్‌రెడ్డి మహిళ ఫొన్ నంబర్ తీసుకున్నాడు. తర్వాత నుంచి తరచూ ఫోన్లు చేస్తూ పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఎదైనా అంటే విచారణలో భాగమే అంటూ ఇబ్బంది పెట్టేవాడు. కొద్ది రోజుల తర్వాత రోజుకు వందలాది కాల్స్ చేయడం, వాట్సప్ మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. మూడు నెలలుగా నిరంతరంగా వచ్చి పడుతున్న మెసేజ్‌లతో మహిళ చాలా ఇబ్బంది పడింది. ఫోన్ చేయొద్దని, మెసేజ్‌లు పెట్టొద్దని కోరినా సీఐ మారలేదు. అసభ్యకరమైన బొమ్మలతో కూడిన  మెసేజ్‌లు బయటకు  చెప్పుకోలేని మెసేజ్‌లు పెట్టేవాడు. వారం రోజుల నుంచి సీఐ చేష్టలు శ్రుతిమించడంతో భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

దయాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. పోలీసులు సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దయాకర్‌రెడ్డికి చెందిన వాట్సప్ నంబర్లు, మరో ఫొన్ నంబర్‌కు చెందిన పలు వివరాలు, కాల్‌లిస్టు సేకరించారు. బాధిత మహిళకు సెల్ ద్వారా, వాట్సప్ నంబర్ ద్వారా పంపించిన మెసేజ్‌లకు సంబంధించిన డేటా సేకరించారు. సీఐడీ విభాగంలో సీఐగా పని చేస్తూ విచారణకు వచ్చిన మహిళను వేధించడంపై  మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు