మీ ఫోన్ నంబర్ లక్కీడ్రాలో గెలిచిందని..

28 Oct, 2016 21:46 IST|Sakshi

కడ్తాల్ : 'మీ సెల్ నెంబర్ లక్కీడ్రాలో గెలిచిందని, రూ.16వేల సెల్‌ఫోన్‌ను రూ.3500కు ఇస్తాం' అని నమ్మించి హరికృష్ణ అనే యువకుడిని మోసం చేశారు. ఈ ఘటన కడ్తాల్ మండలంలోని కర్కల్‌పహడ్ పంచాయితీ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు హరికృష్ణ తెలిపిన ప్రకారం.. పదిహేను రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తికి చెందిన సెల్ ఫోన్ నెంబర్ల నుండి, తనకు కాల్ వచ్చిందని చెప్పాడు. తాము నిర్వహించిన లక్కీడ్రాలో మీ సెల్ నెంబర్ గెలుపొందిందని, రూ. 16వేల విలువ గల శాంసంగ్‌ జే7 ఫోన్‌ను కేవలం రూ.3500కే పార్శీలు ద్వారా పోస్టులో అందిస్తామని నమ్మబలికారు.

హరికష్ణ తన పూర్తి చిరునామా, వివరాలు ఆ అజ్ఞాత వ్యక్తికి తెలిపి డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పార్శీలు వచ్చిందని సమాచారం రావడంతో కడ్తాల్ పోస్టాఫీస్‌కు వచ్చి డబ్బులు చెల్లించి పార్శీలు తీసుకున్నాడు. అది తెరిచి చూడగా.. సెల్‌ఫోన్ బదులుగా పూజ సామాగ్రి, లక్ష్మీదేవి విగ్రహం, ఓ పల్లెం, మెడల్ లాంటివి కనిపించడంతో షాక్‌ తిన్నాడు. తాను మోసానికి గురైనట్లు గమనించి స్థానిక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతూ వారికి ఫిర్యాదు చేశాడు. తనతా మరెవరూ మోసపోవద్దని.. అపరిచిత కాల్స్‌పైన నిఘా ఉంచాలని, అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితుడు హరికృష్ణ అవేదనతో చెప్పాడు.

మరిన్ని వార్తలు