రెంటచింతల (గుంటూరు) : రెంటచింతలలోని హెచ్పీ గ్యాస్ ఏజన్సీ వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయినట్లు ఎస్ఐ ఎ.మల్లికార్జున తెలిపారు. గురజాల బుడగజంగాల కాలనీకి చెందిన ముత్తయ్య (23) ద్విచక్రవాహనంపై రెంటచింతల నుంచి గురజాలకు వెళ్తుండగా అదే సమయంలో రెంటచింతల వైపు నుంచి హరిబాబు అనేవ్యక్తి తన కుటుంబసభ్యులతో కలసి మరో ద్విచక్రవాహనంపై వస్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ముత్తయ్య గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. గాయపడిన హరిబాబు, జ్యోతి, హాసినిలను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.