బైక్‌లు ఢీకొని యువకుడి మృతి

25 Aug, 2016 23:11 IST|Sakshi
 
వెనిగండ్ల(పెదకాకాని): రోడ్డుపై వస్తున్న బైక్‌ను మరో బైక్‌ వేగంగా ఢీ కొనడంతో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి  చెందిన సంఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని వెనిగండ్ల పొలిమేర సెంటర్‌లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రమేష్‌ కుటుంబం కొన్నేళ్లుగా హోటల్‌ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు నరసింహ. గురువారం సాయంత్రం గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల రోడ్డులో బైక్‌పై నరసింహ వస్తుండగా ఎదురుగా వెళుతున్న మరో బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కుడి మోచేతికి, కన్ను వద్ద గాయాలైన ఆ యువకుడిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నరసింహ (20) ఎక్కువగా ఒత్తిడికి గురై బీపీ పెరిగి గుండెనొప్పి రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చేతికంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మతి  చెందడంతో రమేష్‌ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మృతుడు గత కొంతకాలంగా పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. నరసింహ బైక్‌ను ఢీ కొట్టిన వారు పరారీ కాగా స్థానికులు బైక్‌ను నిలిపివేసినట్లు సమాచారం.
 
మరిన్ని వార్తలు