చంద్రబాబు కోసం నోరు పారేసుకోవద్దు

2 Mar, 2016 03:49 IST|Sakshi
చంద్రబాబు కోసం నోరు పారేసుకోవద్దు

నీ స్వార్థం కోసం పార్టీ మారి దిగజారుడు రాజకీయాలా..
ఎమ్మెల్యే ఆది వ్యాఖ్యలపై ఆకేపాటి ధ్వజం

 రాజంపేట : ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి హెచ్చరించారు. మంగళవారం తన స్వగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వ్యక్తిగత స్వార్థంతో పార్టీలు మారి డాంభికాలు పలికితే అవి రివర్స్ అవుతాయని హెచ్చరించారు. దివంగతవైఎస్సార్ చలువతో రాజకీయాల్లో రాణించి, ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు చేయడం చూస్తుంటే జనం అసహ్యించుకుంటున్నారన్నారు. ‘వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీ మారి, ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే  నిన్ను దేవుడు కూడా క్షమించడు.

వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించే హక్కు లేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడం భావ్యం కాదు. జగన్ కుటుంబానికి సంబంధించి మాట్లాడిన మాటలు మహిళలందరినీ కించ పరిచే విధంగా ఉన్నాయి. నీ స్వప్రయోజనం కోసం పార్టీ మారావనే సంగతి ప్రజలందరికీ తెలుసు. నైతిక విలువలు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేయడం తగదు. చంద్రబాబునాయుడుకు దగ్గర కావాలనే లక్ష్యంతో నోటికి ఎంతవస్తే అంత మాట్లాడితే అవి సీఎంకు నచ్చుతాయేమో కానీ ప్రజలు వాటిని క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది’ అంటూ హితవు పలికారు. సమావేశంలో పట్టణ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్, వైఎస్సార్‌సీపీ యూత్ అధ్యక్షుడు యల్లంరాజు సురేష్‌రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు