-
మార్కెట్లు, పరిసరాల్లో చిన్న వ్యాపారుల వద్ద వసూళ్లు
-
400 రెట్లు పెంచిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
-
వ్యాపారం ఉన్నా లేకపోయినా కట్టాలి్సందే
-
సైకిల్, బుట్ట, తోపుడు బండ్ల వ్యాపారులు బేంబేలు
-
రోజు గడవడమే కష్టం... ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని ఆవేదన
సాక్షి, రాజమహేంద్రవరం :
దుకాణాలు అద్దెకు తీసుకొని వ్యాపారాలు చేసుకునే వారు, ఆయా పరిసర ప్రాంతాల్లో బుట్టలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలు, టిఫి¯ŒS సెంటర్లు పెట్టుకుని జీవనం గడిపే వారిపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆశీల (పన్ను) భారం మోపింది. ఒక్కసారిగా దాదాపు 400 శాతం పెంచడంతో బడుగు జీవులు లబోదిబోమంటున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను ఆశీలు వసూలు చేసుకునేందుకు గత నెల 21న టెండర్, వేలం ప్రకటన జారీ చేసింది. నగరంలో ఏడు మార్కెట్లు, రెండు చేపల బజార్లు, ఒక కబేళా ఉన్నాయి. జాంపేట మార్కెట్లో 88 దుకాణాలు, నాగుల చెరువు మార్కెట్లో 106 మంది వ్యాపారులు, సెంట్రల్ కూరగాయల మార్కెట్లో 68 దుకాణాలు, ఆల్కట్తోట మార్కెట్లో ఏసీ షీట్ షెడ్డు, మునికుట్ల అచ్యుతరామయ్య మునిసిపల్ మార్కెట్, గౌతమీ ఘాట్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు ఉన్న అరటి పండ్ల మార్కెట్, లింగంపేట మార్కెట్లు, జాంపేట, స్టేడియం వద్ద
ఉన్న చేపల మార్కెట్లు, వీరభద్రపురంలోని కబేళా వద్ద ఆశీలు వసూలు చేసుకుంనేందుకు నోటిఫికేష¯ŒS జారీ చేశారు. టెండర్, వేలం ద్వారా పాటదారులు చిరు వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. మార్కెట్ల వద్ద స్వీపర్ల జీతాలు, మొత్తం జీతాల విలువలో 10 శాతం నిర్వహణ ఖర్చులు కలిపి సంబంధిత పాటదారుడు నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది.
ఐదు రెట్లు పెరిగిన ఆశీలు...
ఆయా మర్కెట్లలో ఉన్న దుకాణాలతోపాటు పరిసర ప్రాంతాల్లో వందలాది మంది బడుగు జీవులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరి నుంచి వసూలు చేసే ఆశీలు గతంలో కన్నా 400 శాతం పెరిగాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లకు మూడోవంతు మేర పెంచాలి. కానీ 2006 నుంచి ఆశీలును పెంచలేదని మున్సిపల్ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
బుట్టలు, కావిడిలతో పండ్లు, ఇతరత్రావి తెచ్చి విక్రయించే వ్యాపారులకు గతేడాది రూ.5 ఉన్న ఆశీలు ప్రస్తుతం రూ. 20కు పెంచారు. మార్కెట్ల వద్ద బండి నిలిపితే దాని బరువుకు గతంలో రూ.12 ఉంటే ఇప్పడు రూ.60 అయింది. సైకిల్ బరువుకు గతంలో రూ.2లుండగా ప్రస్తుతం పెంచిన రేటు రూ.8లుగా ఉంది. మార్కెట్ ఏరియాలో తోపుడు బండికి రూ.5 ఉన్న ఆశీలు ప్రస్తుతం రూ.20 అయింది. మామిడి పండ్లు మినహా ఇతర పండ్లు బండిపై అమ్మేవారి నుంచి రోజుకు గతంలో రూ.12 వసూలు చేస్తుండగా ఇప్పుడు రూ.60లకు పెంచారు. రోజులో పనసకాయలు ఎన్ని అమ్మితే ఒక్కొక్కదానిపై రూ.8 వసూలు చేసుకునే విధంగా రేట్లు పెంచారు.
మార్కెట్లలో దుకాణాలు, కానాల ఆశీలు పెరుగుదల...
మార్కెట్లలో ఉన్న దుకాణాలు, కానాలకు కూడా ఆశీలు 400 శాతం పెంచింది. జాంపేట మార్కెట్లోని ఏ బ్లాక్లో దుకాణానికి గతంలో రూ.17.50 ఆశీలు వసూలు చేస్తుండగా ఇప్పు డు రూ.70లకు పెంచారు. నాగుల చెరువు మార్కెట్లో రూ.25 నుంచి రూ.100 పెంచారు. మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్లో రూ.6 ఉన్నది రూ. 24 అయింది. గౌతమ ఘాట్ వద్ద అరటి పండ్ల మార్కెట్లో గతంలో రోజుకు సైకిల్కు రూ.5 ఉండగా ఇప్పుడు రూ.20కి పెంచారు.
వచ్చే ఆదాయం ఆశీలకే పాయే...
వ్యాపారం ఉన్నా లేకున్నా ఆ రోజు ఆశీలు కట్టాలి్సందే. ఏ రోజుకారోజు బతికే మాపై ఈ స్థాయిలో పన్నులు పెంచడం సరికాదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. బుట్టలు, కావిడులతో వ్యాపారం చేసేవారు రోజుకు రూ.20 లెక్కన నెలకు రూ.600 ఆశీలు చెల్లించాల్సి ఉంటుంది. తోపుడు బండ్లు, పండ్ల దుకాణం వారు నెలకు రూ.1800, సైకిల్పై వ్యాపారం చేసేవారు రోజుకు రూ.8 లెక్కన నెలకు రూ. 320 చెల్లించాల్సి ఉంటుంది. ఇది తమకు భారంగా మారుతోందని ఆశీలు పెంపును పునఃపరిశీ లించాలని బడుగుజీవులు కోరుతున్నారు.
2006 నుంచి పెంచలేదు..
ప్రతి మూడేళ్లకు మూడోవంతు ఆశీలు పెంచాలి. కానీ 2006 నుంచి ఇప్పటి వరకు పెంచలేదు. జాంపేట మార్కెట్ 2002లో ఏర్పాటైంది. అక్కడ 2007లోఆశీలు పెంచాం. ఆశీలు ఎంత వసూలు చేయాలన్నదానిపై సమీపంలో ఉన్న నగరపాలక సంస్థల విధానాలను పరిశీలించాం. కమిషనర్, మేయర్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి ఎంత పెంచాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల నగరపాలక సంస్థకే ఆదాయం వస్తుంది.
– ఫణికుమార్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ విభాగం)
పదేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాను
మాది సీతానగరం మండలం శింగవరం. పదేళ్ల నుంచి మోటారు సైకిల్పై రాజమహేంద్రవరంలో మొక్కజొన్న కండెల వ్యాపారం చేసుకుంటున్నాను. యూనియ¯ŒS కార్డు ఉన్నా కూడా ఈసారి ఆశీలు కట్టాలని చెబుతున్నారు. రోజుకు వచ్చే ఆదాయంలో 20 శాతం ఆశీలుకేపోతే మేము ఎలా బతికేది.
– మద్దిపోటి విష్ణుమూర్తి, శింగవరం, సీతానగరం మండలం
తగ్గిస్తే మేము బతుకుతాం సారూ...
మాది రాజానగరం మండలం వెలుగుబంద. సీజ¯ŒSలో లభించే పండ్లను సైకిల్పై అమ్ముకుంటూ జీవిస్తున్నాను. వేకువ జామున నాలుగు గంటలకు హోల్సేల్ మార్కెట్కు వెళ్లి సరుకుతో ఉదయం 8 గంటలకు రాజమహేంద్రవరం వస్తాను. జాంపేట లేదంటే మరోచోట వ్యాపారం చేసుకుని ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10 గంటలవుతుంది. రోజుకు రెండు నుంచి మూడువందల ఆదాయం వస్తుంది. వ్యాపారం ఉన్నా లేకపోయినా ఉదయం 9 గంటలకే రోజుకు రూ. 30లు ఆశీలు తీసుకుంటున్నారు. తగ్గిస్తే మేము బతుకుతాం సారూ...
– శ్రీను, వెలుగుబంద, రాజానగరం మండలం