గోదావరి జలాలతో వైఎస్‌కు అభిషేకం

2 Sep, 2016 22:58 IST|Sakshi
గోదావరి జలాలతో వైఎస్‌కు అభిషేకం

 మేడ్చల్‌ రూరల్‌: మేడ్చల్‌ నగరానికి నేడు వస్తున్న గోదావరి జలాలను తీసుకువచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నీటిసమస్యతో బాధపడుతున్న నగర ప్రజల దాహార్తి తీరాలంటే గోదావరి జలాలు నగరానికి తరలించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అబ్దుల్‌ కలాం సుజల స్రవంతి పథకంతో గోదావరి జలాలకు తీసుకొచ్చే పనులు చేపట్టారన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఆయన విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి జలాలను తాము తీసుకొచ్చామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని, గోదావరి జలాలలను తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలతో చాలామందికి ప్రయోజనం కలిగించారన్నారు. వైఎస్సార్‌ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, జిల్లా యూత్‌ విభాగం అధ్యక్షుడు వెంగళ్‌రావు, నాయకులు మోహన్‌రెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు