నెల్లూరు ఆర్టీవో ఇంటిపై ఏసీబీ దాడులు

24 Oct, 2016 09:23 IST|Sakshi

నెల్లూరు : అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు ఆర్టీవో నేరెళ్ల పూర్ణచంద్రరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌శాంతో నేతృత్వంలో ప్రత్యేక బృందాలు గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, వినుకొండ, విజయవాడ, చీరాల, అద్దంకి ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తొమ్మిది ఫ్లాట్లు, వినుకొండలో ఒక నివాసం, చీరాలలో ఒక వస్త్ర దుకాణం, పిడుగురాళ్లలో పప్పుల మిల్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. 

 
గుంటూరు కొత్తపేటలో ఆయన ఉంటున్న నివాసంలో రూ.3.5 లక్షల నగదు, కిలోన్నర బంగారం, 60 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో మరో రూ.20 లక్షలు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఐదుగురు బినామీల వద్ద ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ జేడీ డి.నాగేంద్రకుమార్ గుంటూరుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరో రెండు రోజులపాటు సోదాలు జరిగే అవకాశం ఉందని, పూర్ణచంద్రరావుకు సంబంధించిన లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. దాడుల్లో పలు జిల్లాల ఏసీబీ డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు