బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

20 Sep, 2016 23:19 IST|Sakshi
రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు
శ్రీకాకుళం సిటీ : బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖాధికారిగా గతంలో జిల్లాలో పని చేసిన బి.రవిచంద్రపై పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ(సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్, అమరావతి) ఎస్‌వీవీ ప్రసాదరావు నేతృత్వంలో సోదాలు జరిగాయి. ఏసీబీ డీజీ మాలకొండయ్య ఆదేశాల మేరకు సోదాలు చేపట్టినట్టు డీఎస్పీ మీడియాకు తెలిపారు.
 
రవిచంద్ర కర్నూలులో తొలుత పని చేసిన కాలంలో పలు ఆరోపణలను ఎదుర్కొన్నట్టు చెప్పారు విద్యార్థుల దుస్తుల కుట్టు, సిబ్బంది పదోన్నతుల్లో నిబంధనలను అతిక్రమించడం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుంచి స్కాలర్‌షిప్పుల పేరిట లంచాలు వసూలు చేయడం, అకౌంటెంట్, లైబ్రేరియన్‌ పోస్టుల్లో సొంత వారిని నియమించడం, వాల్మీకి జయంతికి హాస్టల్‌కు రూ.50వేలు మంజూరు చేయగా అందులో రూ.2వేలు లంచంగా తీసుకోవడం, ప్రతి నెలా వసతిగృహ సంక్షేమాధికారుల నుంచి రూ.5వేలు వసూలు చేయడం వంటì   ఆరోపణలు రవిచంద్రపై ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో పని చేసిన సమయంలో కూడా ఈయనపై వసతిగృహాల్లో బంకర్‌బెడ్స్‌లో అక్రమాలు, సంక్షేమాధికారులు, ఎఫ్‌ఏసీల పేరిట బదిలీలు, అవసరం లేకుండా వార్డెన్లకు మెమోలు జారీ చేస్తూ వారి నుంచి డబ్బులు తీసుకోవడం, కలెక్టర్‌ ఓ వసతిగృహ అధికారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించినా..అది అమలు చేయకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించి తొలుత శ్రీకాకుళం జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో రవిచంద్ర పనిచేసే సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించి రికార్డులను పరిశీలిస్తున్నామని చెప్పారు. తరువాత కర్నూలు జిల్లాలో కూడా విచారణ చేపడతామని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.  
 
 
మరిన్ని వార్తలు