ఆత్మకూరురూరల్ : చోరీ చేసిన ఇనుపకమ్ములను ఆటోలో వేసుకుని వేగంగా వెళ్తూ బోల్తా పడటంతో ఇద్దరికి గాయాలైన సంఘటన బుధవారం రాత్రి మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శాంతినగర్కు చెందిన పాతనేరస్తుడు శ్రీనివాసులు, ఆటోవాలా వెంకటరమణతో కలిసి నెల్లూరు–ముంబై రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో కట్ చేసి ఉన్న కొన్ని ఇనుపకమ్ములను చోరీ చేశారు. వాటిని ఆటోలో పేర్చుకుని అమ్మేందుకు ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆత్మకూరు బైపాస్రోడ్డు వెంకట్రావుపల్లి బ్రిడ్జి వద్ద వేగంగా వస్తున్న ఆటో బోల్తాపడింది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. వారే వైద్యం కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.