రోజూ ఎక్కే బస్సే మృత్యు శకటమై...

22 Jun, 2017 23:55 IST|Sakshi
  • స్కూల్‌బస్సు కింద పడి విద్యార్థిని మృతి
  • జారిపడిన బెల్టు తీసుకుంటుండగా ఘటన
  • లారీల హారన్ల మోతలో డ్రైవర్‌కు వినపడని క్లీనర్‌ అరుపులు
  • సీతానగరం (రాజానగరం) :
    తను చదువుతున్న స్కూల్‌ బస్‌ యమపాశం అయింది. తన తోడుగా స్కూల్‌లు వెళ్ళే అక్కను ఒంటిరిని చేసింది. తల్లిదండ్రులకు శోకం మిగిల్చింది. మండలంలోని జాలిమూడిలో వేకువ జామున విషాద ఛాయలు అలముకున్నాయి. స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఆరో తరగతి చదువుతున్న కంటిపూడి నవ్యశ్రీ (11)ప్రాణాలు కోల్పొయింది. కంటిపూడి కోటేశ్వరావు, సౌజన్యలకు ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె లక్ష్మిశ్రీ, ఆరో తరగతి చదువుతున్న నవ్యశ్రీ ఉన్నారు. ఇద్దరూ కలిసి కాటవరంలోకి శ్రీమహతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చదువుతున్నారు. గురువారం ఉదయం 7.30 గంటలకు స్కూల్‌కు వెళ్లడానికి రోడ్డుపైకి వచ్చి తమ స్కూల్‌ బస్సును అక్క లక్ష్మిశ్రీ ఎక్కిన అనంతరం నవ్యశ్రీ బస్‌ ఎక్కుతుండగా నడుముకు ఉన్న స్కూల్‌ బెల్ట్‌ ఊడి కిందపడింది. ఒక్కమెట్టు ఎక్కిన నవ్యశ్రీ తిరిగి బస్‌దిగి బెల్ట్‌ తీసుకునే సమయంలో డ్రైవర్‌ బస్‌ను ముందుకు తీసుకువెళ్ళడంతో నవ్యశ్రీ బస్‌ టైర్‌ కిందకి వెళ్లిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. తల్లి కళ్లెదుటే ఈ ఘటన జరగడంతో స్థానికులు బాలికను రాజమహేంద్రవరంలో సాయి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు పోయాయని వైద్యులు ధ్రువీకరించారు. స్థానికుల వివరాల మేరకు బస్‌ ఆగిన తరువాత స్కూల్‌ బస్‌ ఎదురుగా ఇసుక లారీ, వెనుక నుంచి ఇసుకను తీసుకువెళ్లడానికి వచ్చిన ఖాళీ లారీలు వచ్చాయన్నారు. స్కూల్‌ బస్‌ ఎక్కడానికి వచ్చిన అక్కచెల్లెలు ఇద్దరు బస్‌ ఎక్కుతుండగా, ఒకేసారి ముందు, వెనుక ఉన్న లారీలు మార్గం కోసం హారన్‌ కొట్టడం, నవ్యశ్రీ బస్‌ దిగడం ఒకేసారి జరిగిందన్నారు. నవ్యశ్రీ కిందకు దిగిందని క్లీనర్‌ చెబుతున్నా డ్రైవర్‌కు లారీల హారన్‌లతో వినిపించలేదని, దీనితో లారీలకు మార్గం ఇవ్వడానికి ముందుకు నడిపాడని, దీనితో నవ్యశ్రీ టైర్‌ కింద పడిందని అక్కడే ఉన్న హోటల్‌లోని వారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు తరలివచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా తగుచర్యలు తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏఎస్సై మావుళ్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు 
     
మరిన్ని వార్తలు