ప్రత్యేకహోదాపై డ్రామాలు సహించం

8 May, 2016 21:33 IST|Sakshi
వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ
అమృతలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం డ్రామాలాడితే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట అధ్యక్షుడు, పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో భాగంగా కలెక్టరేట్ వద్ద జరిగే కార్యక్రమానికి భాగస్వాములను చేసేందుకు ఆయన ఆదివారం గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కూచిపూడి వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దగాపడుతున్న ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్నికల వాగ్దానాలు అమలుచేయకపోగా.. రైతులను నిట్ట నిలువునా ముంచి, అప్పులు పాలయ్యేలా చేశారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిని కల్పించారని విమర్శించారు. 
 
నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగభృతి నెలకు రూ. 2 వేలు ఇస్తామని హామీనిచ్చి మరచిపోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఏమాత్రం లేదని చెప్పారు. అప్పుడు ఓటుకు నోటు కేసులో పీకల్లోతులో ఇరుక్కుపోయిన చంద్రబాబు ఇటీవల రాజధాని భూముల్లో కూడా అడ్డంగా దొరికి అవినీతి ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఎక్కడ సీబీఐ ఎంక్వయిరీ చేస్తారోనని హోదాను దాటేస్తున్నారని విమర్శించారు.
>
మరిన్ని వార్తలు