నిధుల రికవరీకి చర్యలు

12 Sep, 2017 23:29 IST|Sakshi
నిధుల రికవరీకి చర్యలు
- 28 పంచాయతీల్లో సర్‌చార్జీ సర్టిఫికెట్ల జారీ 
- స్పెషల్‌ డ్రైవ్‌కు స్పందించని 4 మార్కెట్‌ కమిటీలు
 - స్టేట్‌ ఆడిట్‌ జిల్లా అధికారిణి శ్యామలా జ్యోతి 
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని 28 పంచాయతీల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీ కోసం సర్‌చార్జీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు స్టేట్‌ ఆడిట్‌ జిల్లా అధికారిణి శ్యామలజ్యోతి తెలిపారు. మంగళవారం ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మాత్రమే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 28 పంచాయతీలకు సంబంధించి రూ.13.09 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలిందన్నారు.
 
ఈ నిధులను తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరడంతో పాటు  కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు జిల్లా పరిషత్, జిల్లా గ్రంథాలయ సంస్థ. సైనిక్‌ వెల్పేర్, ఉపాధి కల్పన సంస్థ,  మార్కెట్‌ కమిటీలు, అఫీషియల్‌ రిసీవర్, ఈ-సేవలు, రైతుబజార్లలో ఆడిట్‌ పూర్తయిందన్నారు.  నెల రోజులుగా పంచాయతీలు, మండల çపరిషత్‌ల్లో ఆడిట్‌ చురుగ్గా సాగుతోందన్నారు.
 
మార్కెట్‌ కమిటీల్లో పేరుకుపోయిన ఆడిట్‌ అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఇటీవలే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామని, అయితే ఆత్మకూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, కర్నూలు మార్కెట్‌ కమిటీలు స్పందించలేదని తెలిపారు. నంద్యాల, ఆదోని, ఆలూరు, కోవెలకుంట్ల, ఎమ్మిగనూరు మార్కెట్‌ కమిటీలు మాత్రం స్పందించాయని,  పలు అభ్యంతరాలకు జవాబులిచ్చి పరిష్కరించుకున్నారని శ్యామలాజ్యోతి తెలిపారు. 
 
మరిన్ని వార్తలు