రోడ్డు ప్రమాదంలో ఏడీఈ మృతి

9 Oct, 2016 00:24 IST|Sakshi
వర్ధన్నపేట టౌన్‌ (వరంగల్‌) : వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలోని ఆకేరు వాగు బ్రిడ్జిపై ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టగా గాయపడిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై ఉపేందర్‌ కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రాంతానికి చెందిన ధూళిపాల జగన్‌మోహన్‌రావు (55) అక్కడ విద్యుత్‌ సంస్థలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఏలూరు నుంచి భార్య రోహిణి, కుమారుడు జయకృష్ణతో కలిసి కారులో సిద్ధిపేటలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. జయకృష్ణ కారు నడుపుతున్న క్రమంలో వర్ధన్నపేట ఆకేరువాగు బ్రిడ్జిపై అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారు నుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా జగన్‌మోహన్‌రావు కొంతసేపటికే మృతిచెందారు. అతడి కుమారుడు జయకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జగన్‌మోహన్‌రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శనివారం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగన్‌మోహన్‌రావు భార్యకు గుండె జబ్బు ఉండటంతో ఆయన మరణించిన విషయాన్ని ఆమెకు తెలియజేయలేదు. తండ్రికి తలకొరివి పెట్టాల్సిన తనయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.
 
మరిన్ని వార్తలు