ఆస్తుల అఫిడవిట్ కోర్టుకు ఇచ్చిన అగ్రిగోల్డ్

24 Aug, 2015 18:03 IST|Sakshi

హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలకు అగ్రిగోల్డ్ యాజమాన్యం స్పందించింది. తమ ఆస్తుల వివరాల అఫిడవిట్ను కోర్టుకు సమర్పించింది. తమకు ఏడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కోర్టు పేర్కొంది. ఇక తెలంగాణ, ఏపీలో రూ.14కోట్ల ఆస్తులు ఉన్నాయని అగ్రిగోల్డ్ యాజమాన్యం వివరించింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ రూ.6,350 కోట్లను డిపాజిట్లుగా వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్ల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రజా సమీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేశామని, కేసు కూడా నమోదు చేశామన్నారు. ఆస్తుల జప్తును సవాలు చేస్తూ అగ్రిగోల్డ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ, జప్తుపై హైకోర్టును ఆశ్రయించడం ద్వారా అగ్రిగోల్డ్ ఉద్దేశం అర్థమవుతోందని, వారికి నిజాయితీ ఉంటే కోర్టుకు వచ్చే వారే కాదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, ఆస్తులు విక్రయించి డిపాజిట్లను వెనక్కు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించిన 14 ఆస్తుల వివరాలను కూడా ఇచ్చామని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ డిపాజిట్ దారులకు చెల్లించేంత మొత్తం ఆస్తుల వివరాలు తెలపాలని కోరింది.
 

>
మరిన్ని వార్తలు