విమానాశ్రయం (గన్నవరం) : దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం గన్నవరం ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఉదయం 10 గంటల వరకు ఎయిర్పోర్టు పరిసరాలను పొగమంచు కమ్మేసింది. రన్వే కనిపించకపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉదయం 7.30 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్కోస్టా విమానం 10 గంటలకు బయలుదేరింది. ఉదయం 8.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిరిండియా విమానం 10.10 గంటలకు చేరుకుంది. ఈ విమానానికి రన్వే క్లియరెన్స్ రాక సుమారు పది నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టి 10.20కు రన్వేపై దిగింది. హైదరాబాద్ నుంచి ఉదయం 9.15 గంటలకు రావాల్సిన స్పైస్జెట్ విమానం 11.10 గంటలకు వచ్చింది. హైదరాబాద్ నుంచి 9.30 గంటలకు రావాల్సిన ఎయిరిండియా ఏటీఆర్ విమానం 11.30కి చేరుకుంది. విమానాలు సుమారు రెండు నుంచి రెండున్న గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రన్వేపై దట్టమైన పొగమంచు ఉండడం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు తెలిపారు. సాయంత్ర విమాన సర్వీసులు కూడా సుమారు గంట పాటు ఆలస్యంగా నడిచాయి.