మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ దాడి

16 Mar, 2016 01:37 IST|Sakshi

అనంతపురం క్రైం : మద్యం మత్తులో ఓ మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ దాడి చేశారు. ఈ ఘటన స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ కేసులో ఓ మహిళను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు కాపలా ఉండేందుకు మహిళా కానిస్టేబుల్‌ను రాత్రి విధులకు రావాలని ఎస్‌ఐ కమ్మన్న ఆదేశించారు. ఆమె అలాగే హాజరై..  నిందితురాలి వద్ద విశ్రమించింది.  రాత్రి 10.30 గంటల సమయంలో ఎస్‌ఐ.. మహిళా కానిస్టేబుల్‌ను నిద్రలేపారు. ‘నేను ఎన్ని గంటలకు డ్యూటీకి రమ్మన్నాను.

నువ్వు ఎన్నిగంటలకు వచ్చావం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెప్పిన సమయానికే వచ్చాను కదా సార్’ అని ఆమె సమాధానం చెప్పేలోపే ‘ఏయ్.. నాకే ఎదురు  చెబుతావా? నేనంటే ఏమనుకున్నావం’టూ దాడి చేశారు.  ఆమె బయటకు వచ్చేందుకు  ప్రయత్నించగా అప్పటికే ఎస్‌ఐ గేటుకు తాళం వేసి తాళం చెవి తన వద్ద ఉంచుకున్నారు. విధిలేని పరిస్థితిలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు రాగానే సీసీఎస్ ఎస్‌ఐ గేటుకు తాళం తీశారు. వెంటనే బాధితురాలు వన్‌టౌన్ సీఐ రాఘవన్‌ను ఆశ్రయించింది. మద్యం మత్తులో తనపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు