ఆలేరులో కళ్లెం యువకుడి దుర్మరణం

4 Sep, 2016 23:44 IST|Sakshi
కళ్లెం(లింగాలఘణపురం) : మండలంలోని కళ్లెం గ్రామానికి చెందిన బుషిగంపల శ్రీనివాసు(28) ఆదివారం నల్లగొండ జిల్లా ఆలేరు స్టేషన్‌లో రైలు ఎక్కుతూ జారిపడి దుర్మరణం పాలయ్యాడు. అతడు హైదరాబాద్‌లోని ఓ టీవీ చానల్‌లో పని చేస్తున్నాడు. అక్కడే ఉండే శ్రీనివాసు, గత రెండు నెలలుగా స్వగ్రామమైన కళ్లెం నుంచి హైదరాబాద్‌కు రైలులో వెళ్లి వస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి ఉదయం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామానికి బయలుదేరిన శ్రీనివాసు ఆలేరులో ట్రైను దిగి, తిరిగి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి మృత్యువాత పడ్డాడు. తండ్రి చనిపోవడంతో తల్లి, భార్య స్వప్న, ఏడాది కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్‌ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇటీవలæఏడాది కూతురి పుట్టిన రోజు చేసిన శ్రీనివాసు గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఆయన మృతితో కళ్లెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 
విష జ్వరంతో వ్యక్తి మృతి
ఏటూరునాగారం :  మండలంలోని రొయ్యూర్‌ గ్రామానికి చెందిన కావిరి మల్లయ్య(40) విష జ్వరంతో ఆది వారం మృతి చెందాడు. ఆయన గత వారం రోజులుగా జ్వరంతో స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. అయినా జ్వరం తగ్గలేదు. ఆదివారం ఉదయం జ్వరం తీవ్రత పెరిగి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్యాపిల్లలు ఉన్నారు. 
ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
నర్సింహులపేట : మండలంలోని దంతాలపల్లికి చెందిన బండి అశోక్‌(35) ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని, అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడికి భార్య జ్యోతి, కుమార్తె ఉన్నారు. పీఎస్సై తిరుపతిరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. 
మరిన్ని వార్తలు