హోదా కోసం పార్టీలన్నీ కలిసి పోరాడాలి

28 Aug, 2016 20:59 IST|Sakshi
పాలకొల్లు టౌన్‌ : ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఒకే వేదికపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే కేంద్రం దిగివస్తుందని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు అవకాశవాదంగా వెళితే రాష్ట్రం విడిపోయే విషయంలో ఏ విధమైన నష్టం జరిగిందో అదే మళ్లీ  పునరావృతం అవుతుందన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం కలిసి పార్లమెంట్‌ సభ్యులతో ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేక యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి అధికారంలోకి వచ్చాక మాటమార్చడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో ప్రత్యేక హోదాపై అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ శేషుబాబు చెప్పారు. 
 
 
 
 
 
మరిన్ని వార్తలు