రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది:ఆర్కే

1 Apr, 2016 18:20 IST|Sakshi

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనే పునరావృతమై కరువు కాటకాలు, విద్యుత్ చార్జీల భారాలు, పన్నుల మోత తప్ప రాష్ట్రప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆర్కే పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల మోతతో చంద్రబాబు తన మోసపు నైజాన్ని మరోసారి నిరూపించాడని మండిపడ్డారు.



దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదల బతుకులు చిధ్రం చేశారని విమర్శించారు. శాసనసభలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సభ చరిత్రలోనే మాయనిమచ్చగా మిగులుతుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అంతా సభ సాక్షిగా అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారిన వారి సభ్యత్వాలుపోయి ఎన్నికలకు వెళితే గెలవలేమనే భయంతో వారిని రక్షించేందుకు ప్రభుత్వం దుస్సంప్రదాయాలకు ఒడిగట్టిందని విరుచుకుపడ్డారు.




ప్రతిపక్షం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానాలు చెప్పలేక మంత్రులు, ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఎదురు దాడులు చేసి తప్పించుకున్నారన్నారు. అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొనే ధైర్యం చేయలేక మూజువాణి ఓటు పేరుతో ప్రభుత్వం పారిపోయిందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వడంలోనూ ప్రభుత్వ తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు.

 

  రాష్ట్రప్రజలు ప్రభుత్వ మోసాలను నిశితంగా గమనిస్తున్నారని, అవసరమైన సమయంలో గట్టిగా బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేవలం రాజధాని జపంతో కాలం నెట్టుకువస్తున్న ప్రభుత్వానికి ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న ఆగ్రహ జ్వాల బయటపడే రోజు ఎంతో దూరంలో లేదని ఆర్కే పేర్కొన్నారు. ప్రజాగ్రహ జ్వాలలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కావడం తథ్యమన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ, రూరల్ కన్యీనర్లు మునగాల మల్లేశ్వరావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ పచ్చల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు