ఒండ్రు మట్టితో భక్తుల ఇబ్బందులు

5 Aug, 2016 01:05 IST|Sakshi
ఒండ్రు మట్టితో భక్తుల ఇబ్బందులు
 మంగపేట : మండల కేంద్రంలోని గోదావరి పుష్కరఘాట్‌ వద్ద ప్రమాదం పొంచి ఉన్నప్పటికి సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అంత్య పుష్కర స్నానానికి వస్తున్న భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఐదు రోజుల నుంచి స్థానికులతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు రోజుకు సుమారు 50 మంది వరకు మంగపేట పుష్కరఘాట్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా వారు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. అయితే పుష్కరాలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా ఘాట్‌ మెట్లపై పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించకపోవడంతో పుష్కరస్నానానికి నీటిలోకి దిగుతున్న భక్తులు జారిపడుతున్నారు. ఒండ్రుమట్టి కారణంగా కొందరు భక్తులు పుష్కరస్నానం చేయకుండా తలపై నీటిని చల్లుకుని వెళ్తుండగా.. మరికొందరు కర్రల సాయంతో నీటిలో మూడు మునకలు వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించి వెళ్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఘాట్‌ మెట్లపై పేరుకుపోయిన ఒండ్రుమట్టిని తొలగించాలని భక్తులు కోరుతున్నారు. 
మరిన్ని వార్తలు