-

పర్యాటకాభివృద్ధికే అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌

1 Oct, 2016 22:03 IST|Sakshi
పర్యాటకాభివృద్ధికే అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌
మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు
 
విజయవాడ :
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు ప్రతిబింబంగా రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌–2016 నాంది పలుకుతుందని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. నగరంలో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌ –2016 వెబ్‌సైట్‌ను మంత్రులు అధికారికంగా ప్రారంభించారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్‌ వర్గాలను రాష్ట్రం వైపు దృష్టిసారించేలాగా నూతన వ్యవస్థకు నాంది ప్రస్తావనగా స్వరాజ్యమైదానంలో అమరావతి షాపింగ్‌ ఫెస్టివల్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఫెస్టివల్‌లో వివిధ ఉత్పత్తులను డిస్కౌంట్‌ స్కేల్‌ విధానంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫెస్టివల్‌లో ఉత్పత్తిదారులు, షాపింగ్‌ నిర్వాహకులు, ప్రముఖ షాపింగ్‌ మాళ్ల నిర్వాహకులు భాగస్వామ్యులయ్యేలా జిల్లా యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే జూవెలరీ, ఫర్నిచర్, రెడీమెడ్‌ తదితర సంస్థలు, షాపుల నిర్వాహకులు ముందుకు వచ్చారని తెలిపారు. కలెక్టర్‌ బాబు.ఎ మాట్లాడుతూ వ్యాపారులు షాపుల నిర్వహణకు కొద్దిమొత్తంలో రుసుం చెల్లించి తమ ఉత్పత్తులకు అద్భుత ప్రచారం పొందొచ్చని సూచించారు. ఇకపై వార్షిక వేడుకగా అమరావతి ఫెస్టివల్‌ నిలుస్తుందని, ఆ దిశగా కార్యచరణ రూపొందించామని పేర్కొన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని జరిగే రూ.1000 కొనుగోలుపై బహుమతులు అందిస్తామని, ఫెస్టివల్‌ జరిగే అన్ని రోజులూ లక్కీడ్రా తీస్తామని తెలిపారు. 
కార్నివాల్‌ ర్యాలీ ప్రారంభిం
ఫెస్టివల్‌ ప్రారంభంలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మంత్రులు కార్నివాల్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ బందరు రోడ్డులో బెంజిస్కరిల్‌ వరకు సాగింది. మున్సిపల్‌ కమిషనర్‌ వీరపాండియన్, సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ సృజన తదితరులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు