చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?: వైఎస్ జగన్

4 Jun, 2016 18:26 IST|Sakshi
చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?: వైఎస్ జగన్

అనంతపురం : ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శనివారం కదిరిలో బహిరంగ సభలో మాట్లాడారు.

'యాత్రలో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 80 కుటుంబాల వద్దకు వెళ్లడం జరిగింది. చనిపోయినవారిలో దాదాపుగా 15మంది చేనేత కార్మికులు ఉంటే మిగతావారు రైతులే. ఒక్క అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఎవరు?.ఎన్నికల ముందు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. చంద్రబాబు సీఎం అయ్యారు...బ్యాంకుల్లో బంగారం ఇంటికొచ్చిందా?. రుణాలు కట్టొద్దంటు రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు.

రుణాలు కట్టకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడింది. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారు.  చంద్రబాబు  ఎంసీ అయిన తర్వాత డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడింది. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. మరి అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు హామీ ఏమైంది. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోయారు. పట్టపగలే చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.

ఒక్కో ఎమ్మెల్యేను రూ.30 నుంచి రూ.40 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ను ఎందుకు నిలదీయడం లేదు. ఓటుకు కోట్లు కేసులో దొరికినందుకే కేసీఆర్ను చంద్రబాబు నిలదీయలేకపోతున్నారు. నిలదీస్తే చంద్రబాబును జైలుకు పంపుతారు. అక్రమ ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు పెట్టాలా వద్దా?. రాయలసీమలో మోసం చేసిన వారిని చెప్పుతో కొట్టాలంటారు. ఇంతమందిని మోసం చేసిన చంద్రబాబును ఏం చేయాలి. ముఖ్యమంత్రిని ఏమీ అనకూడదంట. కానీ ఆయన మాత్రం మోసాలు చేయొచ్చు... అబద్దాలు ఆడొచ్చు. మనమంతా కలిసికట్టుగా ఒకటై వ్యవస్థలో మార్పులు తీసుకొద్దాం' అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు