ఏపీని అఫ్గాన్‌గా మారుస్తున్న చంద్రబాబు

1 Dec, 2016 00:28 IST|Sakshi
ఏపీని అఫ్గాన్‌గా మారుస్తున్న చంద్రబాబు
హామీలను నెరవేర్చలేక పోలీసు పాలన
వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ చైర్మన్‌  చెవిరెడ్డి ధ్వజం
కడియం : ఆంధ్రప్రదేశ్‌లో పాలన అధోగతిలో సాగుతోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సేవాదళ్‌ చైర్మన్‌ , చంద్రగిరి ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని జేగురుపాడులో పార్టీ రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో బుదవారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక వాళ్ళ ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో పోలీసులను ముందు పెట్టి పాలన సాగిస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు తన పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను ఆఫ్గాన్‌ గా మారుస్తున్నారన్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకొనే ధైర్యం లేక వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. కొందరు పోలీసు అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు బలవంతంతో పచ్చచొక్కాలు తొడుక్కుని వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వారి స్వార్థం కోసం తప్పుడు కేసులు పెడుతున్నారని, వారి నిర్ణయాలకు పోలీసు అధికారులు బలికాకుండా చూసుకోవాలని హితవుపలికారు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కాపులను వెంటాడి కేసులు పెడుతున్నారన్నారు. చంద్రబాబును అందలం ఎక్కించిన పాపానికి కాపులు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై ఎన్నిసార్లు కేసులు పెడతారని ప్రశ్నించారు. ప్రజల కోసం పోరా>డే నాయకులు కేసులకు భయపడరని స్పష్టం చేశారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని, కోర్టుద్వారా అవి తప్పుడు కేసులేనని నిరూపిస్తామని చెప్పారు. దమ్మున్న నాయకుడు, పోరాటయోధుడు, పేదల పక్షపాతిగా ఉన్న జగన్‌  ప్రతి వైస్సార్‌ సీపీ కార్యకర్తకు అండగా ఉంటారన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, వేగుళ్ళ లీలాకృష్ణ, ముత్తా శశిధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు, యాదల సతీష్‌చంద్ర స్టాలిన్‌ , విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యుడు సలాం బాబు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు