కర్నూలు(అగ్రికల్చర్): గ్రామాల వారీగా పశుగ్రాసం క్షేత్రాలను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ సోమశేఖరం తెలిపారు. ఐదు నుంచి పదెకరాలను లీజుకు తీసుకొని వాటిలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పశుగ్రాసాలను సాగు చేయించాలని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటు.. తదితర వాటి గురించి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్కార్డు కలిగిన వారితో లీజుకు తీసుకున్న భూముల్లో పశుగ్రాసాలు సాగు చేయించి ఉత్పత్తి అయిన మేతను గ్రామైక్యసంఘాల ద్వారా రైతులకు కిలో రూపాయి ప్రకారం పంపిణీ చేయాలన్నారు. వెంటనే భూములను గుర్తించాలని తెలిపారు. గ్రామాల వారీగా ప్రతి 1500 పశువులకు ఒక రీసోర్సు పర్సన్ను నియమించి పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చి వారి ద్వారా రైతులకు తగిన సేవలు అందించాలని తెలిపారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పశుసంవర్ధక శాఖ జేడీ సుదర్శన్కుమార్, డీడీ చెన్నయ్య ఏడీలు సీవీ రమణయ్య, పి.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.